(వేటూరి సుందరరామమూర్తి, 29 January 1936 – 22 May 2010)పాటలో తెలుగు పదాల కోసం వెతకవలసిన ఈ తరంలో ..
సాహిత్యపు పదభావాలను వెతుక్కునేలా చేసి
భావాన్వేషణలో మేము తలమునలకలయితే
ఇక ఈ లోకంతో పని లేదంటూ పరలోకానికి జారుకుంటావా?
' వేణువులా భువనానికి వచ్చావంటూ'
నవరంద్రాలతో జీవి భూమ్మీదికొచ్చాడని,
' గాలినై గగనానికి పోవడం' అంటే
కీర్తిని ప్రతి మనసులో 'గాలి శూన్యాన్ని ఆవహించినట్టు' నింపడమని
చెప్పడానికే నీవు తప్పుకొన్నావా?
ఆరగిపోయీ, మరచి పోయిన తెలుగు పదానికి
పచ్చని పల్లెలనూ, పదహారేళ్ళ పడచు అందాలనూ
గోదారి అలలనూ, అజంతా హొయలనూ అద్ది
నిద్రాణంలో ఉన్న భాషను బతికించడానికి తపించి, అలసి నిద్రపోయావా?
కాశ్మీరు అందాలూ, కలకత్తా కావ్యాలు, మీనాక్షి
మధురాలూ, యువరక్తపు భావాలూ,
నటరాజ నాట్యాలూ, నయనాల సొగసులూ
ఓహో.. ఎన్నని చెప్పగలం, ఏమని చెప్పగలం
ఆ కలం నుంచి జారిన తెలుగు సాహితీ ప్రవాహాలు
యవ్వనంలో వైరాగ్యం, వృద్దాప్యంలో జాణతనం
చీకటిలో దాగిన వెలుగునూ, వేడి నుంచి రాలే చలువను
ఎలా స్ప్రుశించావ్, నిన్ను ఎలా స్మరించమంటావ్?
ఎన్ని విరహహృదయాలను లాలించావో,
ఎన్ని మండు గుండెలను చల్లార్చావో?
నీవిక లేవని తెలిసిన మరుక్షణం, నీ ఉనికి కోసం
ఎన్ని గొంతులు 'గూగుల్' గుండెను ప్రశ్నించాయో?
అవి ఒక 'గూగోల్' అయినా ఆశ్చర్యం లేదేమో!
' రాజు జీవించు రాతి గోడలపైన
సుకవి జీవించు ప్రజల నాలుకలపైన '
ఎంత సత్యం, ఎంత నిత్యం
ఈ నాటికీ నీ రూపంలో !
పువ్వు రాలినా రాగమాగదు,
వాడిన పొద్దు వర్ణమూ మారదు
గుండెల్లో దాగిన నీ చాయగా..
గొంతుల్లో ధ్వనించే నీ గానంలా..
సశేషం...