*** ఇది నవ్వుకోవడానికని మాత్రమే, ఎవరిని కించపరచడానికి కాదు. గణేష్ చవితి శుభాకాంక్షలతో.... జై జై జై జై గణేశ! జై జై జై జై!!! ***
****
ఏమండీ! ఎప్పుడూ అలా టి వి చూస్తూ కూర్చుని వినాయకునిలా పొట్ట పెంచుకునే బదులు, కాస్త బయటకెళ్ళి తిరిగి రావచ్చుగా? కిచెన్ లోంచి సీత గొంతు. ఆడవాళ్ళకి పనిలేక మధ్యాహ్నం ఇరుగుపొరుగుతో మీటింగులు పెట్టుకుని ఆ హీరోల గురించి, పక్కవాళ్ళ భర్తల గురించి మాట్లాడుకుని, వాళ్ళ లాగా తమ భర్తలుండాలని, ఇంటికి రాగానే పోరు పెడతారు. అందులోనూ కాసేపయితే 'అగ్నిలో అరుంధతి' 742 వ ఎపిసోడు ప్రారంభమవుతుంది. నాకసలే టి వి సీరియల్స్ అంటే మంట. ఎప్పుడో మా బామ్మ న
డి వయసులో ఉన్నపుడు ప్రారంభమయిన 'వంటింటి రామాయణం' మొన్న బామ్మ 25 వ వర్దంతి దాక అయిపోలేదు.
యాడ్స్ రాకా, సీరియల్స్ లో ఆర్టిస్ట్ లకు జీతాలు ఇయ్యని పరిస్థితి వచ్చి మొన్నే సీరియల్ని ఆపేశారు. అయినా! వినాయకుడు నాలా కాకుండా మాంచి సిక్స్ ప్యాక్ లో ఉంటే నాకీ బాదుండేది కాదు. అందుకే నాలా ఉన్నందుకు ఆయన్ని తిట్టుకుంటూ మెట్లు దిగి హుస్సేన్సాగర్ వైపు నడిచాను.
అసలు ఈ సిక్స్ ప్యాక్ ని ఎవడు కనిపెట్టాడో కాని కనిపిస్తే ఎన్కౌంటర్ చేయాలి. మొదట్లో సీత వూరికే సిక్స్ పాక్స్ అంటే అదేదో ఫ్యామిలి ప్యాక్, జంబో ప్యాక్ లాంటిదనుకుని ఆ మద్య ఓ ఐదు మంది స్నేహితులతో 'బావర్చి' కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆర్డర్ చేశా! వెయిటర్ నన్ను పిచ్చివాణ్ని చూసి 'మెను' మొహానికి విసిరి వెళ్ళిపోయాడు. అందులో ఆ ఐటం లేదు. నాకేమి అర్థం కాలేదు!
అసలు సిక్స్ ప్యాక్ అంటే ఏమిటని ఆరా తీస్తే అది మా ఊళ్ళో అన్నం, గంజి లేక నీళ్ళు తాగి చావడానికి దగ్గర పడే ముసలి పీనుగలకి మళ్లే పొట్ట కనిపించడమని తెలిసింది. దీనికెందుకింతగా బాధపడ్తుందో సీత అని, కొన్ని రోజులు అన్నం తినడం మానేసి గంజి మాత్రం తాగడం ప్రారంబించాను. సరిగ్గా మూడంటే మూడే రోజులు, ఒకటే నీరసం, జ్వరం, అలసట. ఆసుపత్రిలో చేరిస్తే 10 సెలైను బాటిల్స్ ఎక్కించి వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రాణం పోయి తిరిగి వచ్చినంత పనయింది కాని పొట్ట మాత్రం తగ్గలేదు. ఈ సారి సులువు గా ఉంటుందని ఓ మెడికల్ షాపు కెళ్ళి, కుర్రాన్ని పిలిచి పొట్ట తగ్గి సిక్స్ పాక్స్ రావడానికి ఓ పది టాబ్లెట్స్ ఇవ్వవోయ్! అన్నాను. అంతలోపే వాడు నేలపై పడి గిలగిలా కొట్టుకోవడం ప్రారంబించాడు. నాకేమీ అర్థం కాలేదు, అందరూ నన్ను చూసి నవ్వుతుంటే అవమానంగా కూడా తోచింది. నా బాధ ఆ కుర్రవాడికి అర్థమయిందో ఏమో, వాడు ఎదురుగా ఉన్న 'జిమ్' ని చూపించి అక్కడికెళ్ళి రోజూ ప్రయత్నించండి అని సలహా ఇచ్చాడు.
ఈ సారి 'జిమ్' కు వెళ్లి ఓ పది రోజుల్లో సిక్స్ పాక్స్ తెచ్చుకోవాలని పథకం వేశా! ఒక ఆదివారం 'జిమ్' కోసం ప్రత్యేకమైన డ్రెస్సు, షూస్ కొనుక్కుని 'జిమ్' లో జాయిన్ అయ్ పోయా. పొద్దున్న 8 గంటలకే జిమ్ లో అడుగుపెడితే అప్పటికింకా ఎవరూ రానట్లున్నారు. ఇది కూడా మా ఆఫీసు లాగా 10 గంటలకి ప్రారంబమవుతుంది కాబోలనుకుని, అక్కడ ఇనుప గుండ్లూ, రాడ్లూ, కర్రలూ గట్రా చిందర వందరగా పడిఉంటే అన్నీ తీసి అటకపై సర్ది జిమ్ ప్రారంబిద్దామని ఒకటొకటిగా తీసి అటకమీద పెడదామనుకున్నా. అవి కాస్త బరువుగా ఉండి, అటక కొంచెం ఎత్తులో ఉండే సరికి నడుం పట్టుకుని ఒకే విరోచనాలు..
ఈ సారి ఆసుపత్రిలో 10 సెలైను బాటిళ్ళు, కాని వారానికి కాదు, ఒక్క రోజుకి. నరాలకు సూది గుచ్చి సెలైన్లు ఎక్కిస్తుంటే చేతులకున్న నరాలన్నీ వాచి, పొట్ట తగ్గడం దేవుడెరుగు, చేతులు మాత్రం వస్తాడు కు మళ్లే మారినాయ్. ఇవన్నీ కాదు ఈ సారి మాస్టర్ ప్లాన్ వేయాలని ఆలోచిస్తుంటే, పక్క ఫ్లాట్ లో ఉండే రిటైర్డ్ ఇన్కం టాక్స్ ఆఫీసర్ సుబ్బారావ్ , రోజూ అర గంట నడిస్తే సన్నబడతారని సీతతో చెప్పాడట, అప్పటినుంచీ నేను ఇంటికి రాగానే బయటకి పంపడం సీతకలవాటై పోయింది. నేనేమన్నా అంటే వినయకుడిలా కొండంత పొట్ట నీకు, అని గుర్తు చేస్తుంది.
రేపు వినాయక చవితి కదా! ఒక వేల ఆ వినాయకుడే గనక కనపడితే ఆ పొట్ట తగ్గించుకోమని చెప్పాలి, లేకుంటే ప్రతి ఒక్కరు తనతో నన్ను పోల్చి ప్రాణం తింటున్నారు, అనుకుంటూ ట్యాంకుబండ్ పైకి అడుగు పెట్టాను. అటు ఇటూ జనం కోలాహలం, విద్యుద్దీపాల వెలుగులో బుద్దుడు.. చల్లని గాలి, అటు వైపుగా ప్రముఖుల విగ్రహాలూ.. ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ? వీటి మద్య నడుస్తుంటే అసలు సమయమే తెలవదు. అలా నాలుగు సార్లు పచార్లు కొట్టి తిరిగి ఇంటికి వెలదామనుకునే లోపు అటుగా ఓ బెంచీ పైన ఒక వినాయకుడి విగ్రహం పెట్టి ఉండడం కనపడింది. ఇదేమిటీ ఈ రోజు ఇక్కడ వినాయకుడి విగ్రహం అని దగ్గరికి వెళ్తే అది విగ్రహం కాదు, సాక్షాత్తూ ఆ వినాయకుడే. చాలా బాధగా ఉన్నాడు. సీత అనుకున్నట్లు పొట్టేమీ లేదు. సన్నగా ఎముకల గూడుకు తోలు కప్పినట్లున్నాడు. ఈయన కూడా సిక్స్ పాక్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబోలు! అనుకున్నాన్నేను. అయినా రేపు వినాయక చవితి. ఎక్కడో ప్రముఖ చౌరాస్తా లో ఉండవలసిన ఈయన ఇక్కడున్నాడేమిటి?
అదే అడిగాను, ఏం సామీ! రేపు నీ పండగ కదా, నువ్వు జనం మద్య హడావిడిలో కోలాహలంగా సి టి లో ఉండాలి కదా, ఇక్కడున్నావేం? అని.
ఏం చెప్పమంటావ్ నాయనా! ఎన్నో ఏళ్ళ నుంచి నన్ను ఆది దేవుడనీ, నన్ను పూజించనిదే ఏ దేవుడునీ పూజించరాదనీ మీ ప్రజలు ఎంతో గొప్పగా స్టేజీలు వేసి సంబరాలు జరుపుకునే వారు, కాని పోయిన సంవత్సరం నుండి పరిస్తితులు మారి పోయినయ్, మాకు ఆదరణ తగ్గి పోయింది.
అదేం సామీ! యుగాల నుంచి ఇప్పటి దాకా మీరే మా ప్రథమ ఆరాద్యం, కాదని ఎవరంటారు, అయినా ఏమూడు రోజులో అయిదు రోజులో 11 రోజుల తర్వాతో ఇక్కడకు రావాల్సిన మీరు ఇప్పుడే వచ్చి కూర్చున్నారేం?
చెప్పాను కాదా నాయనా! పరిస్తితులు మారిపోయినాయ్, ఆ మద్య మీ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి ఉండేవాడట! ప్రజల కోసం ఏమేమో మంచిపనులు చేసిండంటా, మీటింగుల్లో ఎదుటివారు సవాలు విసురుతూ తొడ కొడితే ఈయన గాల్లో ముద్దులు పెట్టుకునే వారట.
అదా సామీ! ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి ప్రజలు ఆయన్ని వై యస్ ఆర్ అని పిలిచేవారు. కొందరు నాయకుడన్నారు మరికొందరు అపర బగీరతుడన్నారు ఇంకొందరైతే ఏకంగా దేవుడే అన్నారు.
అదే నాయనా! అక్కడే వచ్చి పడింది చిక్కు. ఆయనని మీరు దేవుడని పొగిడే వరకు అది నిజమను కుని ఇప్పుడు మా దేవుల్లకే ఎసరు పెట్టాడు.
ఒక సామాన్య మానవుడు అందులో చనిపోయిన వ్యక్తీ మీకు ఎసరు పెట్టడమేమిటి సామీ?
ప్రతీ సంవత్సరం ప్రముఖ కూడళ్ళలో, రహదారుల్లో రద్దీగా ఉండే రోడ్డుల పక్కన, కాలనీల్లో, పార్కుల్లో మా విగ్రహాలు పెట్టేవారు గుర్తుందా?
గుర్తు లేకేం సామీ, మీరు మా ఆరాద్యులు.
ఏం ఆరాద్యులం లే కాని, ఇప్పుడు ఆ ప్రదేశాలన్నీ ఈయన విగ్రహాలతో నిండి పోయినాయ్, మీమంటే సంవత్సరానికి ఏ అయిదు పది రోజలు మాత్రమే ఖబ్జా చేసుకునే వాళ్ళం, కాని ఈయన మాత్రం మా స్తలాలను పర్మనెంటుగా ఖబ్జా చేసేసుకున్నాడు. అయినా దేవుళ్ళ ఆస్తులకు ఈ రోజుల్లో రక్షణ ఎక్కడుంది మీ లోకంలో?
సామీ! ఆయనకు రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా ప్రపంచమంతా అభిమానులున్నారంటా. ఎంతో మంది జనం ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారంట, కొందరైతే ఏకంగా ఆత్మహత్యలే చేసుకున్నారట తెలుసా? అందుకే ఆయనకు గుర్తుగా, ఓదార్పులు చేస్తూ విగ్రహాలను ప్రతిస్తిస్తున్నారు. అయినా మీరు దేవుళ్ళు, మీ నాయన సృస్టికి ఆదిపురుషుడు, అంటే మీ నాయన పుట్టే నాటికి భూమ్మీద ఎవరూ పుట్టి ఉండరు. అట్లాంటప్పుడు మీ నాయన కూడా కొంత ఆస్తులు వెనకేసుంటే మీకీ కస్టాలు ఉండేవా చెప్పు? ఎవరో వాడుకోవలసిన స్థలాల్లో మీరు సర్దుకునే అవసరం ఉండేది కాదు గదా?
మాకు ఎప్పుడూ భక్తులూ, పేదలూ వారి కష్టాలే కాని మా గురించి ఆలోచించే సమయం ఎక్కడిది చెప్పు, ఇంకా మా నాయనా అంటావా? ఆయనకు కాషాయ వస్త్రం, భూడిద తప్ప ఈ ఆస్తులపై ఆశ లేదు, అవసరం రాలేదు. అయినా ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటాం చెప్పు? అవసరానికి ఆదుకోనూ లేవు, ఆశలనూ తీర్చనూ లేవు. ఆస్తులు ఉంటే ఏం లాభం? లేకుంటే ఏం నష్టం?
అయ్యో! అదేం సామీ అలా అంటారు, మీకు ఆస్తులుంటేనే కదా? దాంట్లోంచి కొంత ప్రభుత్వానికి రాసేసి త్యాగాశీలుడనే బిరుదు కొట్టేయొచ్చు. ఇక ఆస్తులే లేకపోతె దానం చేసేదెప్పుడు? పేరు వచ్చేదెప్పుడు? అందుకే ఒక వెయ్యెకరాలు ఖబ్జా పెట్టి పది ఎకరాలు దానం చేస్తే ఇటు ఆస్తులూ మిగులుతాయి అటు పేరు ప్రతిష్టలూ వస్తాయి. మీరు మరీ అమాయుకులు మళ్లే ఉన్నారే?
అదే, ఖబ్జా పెట్టుకుని ఏం చేయమంటావ్, ప్రజలకయితే దేనికైనా ఉపయోగ పడ్తుంది కాదా? మీరు సంతోషంగా ఉండడమే కదా మాకైనా ఈ నాయకులకయినా కావాల్సింది?
మీకు బొత్తిగా లోక జ్ఞానం కరువైంది సామీ. పాత తరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనకంటూ ఓ పేరూ పలుకుబడీ పది మంది జనం ఉండాలంటే ఆస్తులు తప్పకుండా ఉండాలి. అంతెందుకు మీ దేవుళ్ళు కూడా ఆస్తులు పోగు పెట్టినందుకే కదా, ఈ రోజు అంత దర్జాగా బతకగలుగుతున్నారు. ఎంతోమంది నాయకుల్ని బతికిస్తున్నారు.
ఏమిటీ! మా దేవుళ్ళు ఆస్తులు ఖబ్జా చేసుకున్నారా?
లేకేం సామీ? ఆ మూడు నామలాయన ఏకంగా ఏడుకొండలనే ఖబ్జా చేసుకోలేదా? ఇక డబ్బుకూ, నగలకూ కోరవే లేదు. అందుకే ఆయన వెంటే జనం, ఆయన చెంతే జనం. ఆ ఆస్తులని కొంచెంకొంచెం కాజేస్తూ ఎంతోమంది తరాలుగా సుఖపడడంలేదా?
ఆయన ఆస్తులు ఖబ్జా చేయడమేమిటి? మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక, ఎక్కడైనా దాక్కుందామని, ఈ గుబురు అడవులూ, ఏడు కొండలూ దాటుకుని ఇక్కడికొచ్చాడు. ఆయినా జనం వదలలేదు. భక్తులు ఆయన్ని తిరిగిరమ్మని ఎన్నో ముడుపులూ, కానుకలు ఎర వేసినా ససేమిరా అన్నాడు ఆ సామీ. మీ మోసాలనూ కుళ్ళునూ భరించే శక్తి నా దగ్గర లేదు మహాప్రభో నన్ను వదిలేయండని అక్కడే సెటిలయిపోయాడు .
సరే ఆ విషయం పక్కన పెట్టండి సామీ! మీకు ఆ దేవుడికి మళ్లే లేకున్నా కనీసం మానాయకులకు మళ్లే ఆస్తులున్నా ఈ రోజు మీకీ దుస్తితి వచ్చేది కాదు గదా? అవును సామీ, ఆస్తులు లేకుంటే లేదు, కనీసం మీ దగ్గర బంగారు ఆభరణాలూ, వజ్ర వైడూర్యాలూ అయినా ఉన్నాయా?
బంగారం, వజ్రాలూ నాకెప్పుడు బహుమతి ఇచ్చారు మీరు? మట్టితో చేసి దానికి బంగారు రంగులే కదా అద్దేది? దానికే భక్తులిచ్చే అమూల్య కానుకని సంబరపడిపోయి దేవలోకంలో నేనే దనవంతున్ని అని ఫీల్ అయ్యేవాణ్ని. ఏ మాట కామాటే చెప్పు కోవాలి మీరు వేసే ఆ రంగులు, ఆభరణాల కన్నా అందంగా ఉంటయ్ తెలుసా?
ఫీల్ అయ్యే వాణ్ని అంటున్నారు, ఇప్పుడు ఆ ఆనందం లేదా? సామీ.
ఎక్కడి ఆనడం నాయనా! వేసే రంగుల్లో రసాయనాలున్నయట , అందుకే ఇక వాటిని వేయకూడదని మీ ప్రబుత్వం తీర్మానిన్చిందట! అందుకే ఆ రంగులు కూడా కరువయి నిరుపేదలా మారిపోయాను. నా పేదరికాన్ని చూసి మిగితా వాళ్ళు నవ్వుకుంటున్నారు.
చూసారా సామీ! పేదలంటే ఎంత చులకనో ఈ లోకంలో, అందుకే మనకంటూ పదెకరాల ఫాంహౌసో, బంజారా హిల్స్ లో ఓ పెద్ద కొంప, ఓ పది ఇరవై కోట్ల ఆస్తి, దానితో పాటు మోయలేనంత పసిడి ఉండాలి, దానితో పాటు అమాయకులను మోసం చేసే గుణం కూడా ఉండాలి. ఆ మాత్రం లేకుంటే ఇక్కడ బతకలేం, బతికినా వేస్టే. అది సరే సామీ! కొండంత పొట్ట ఉండే మీరు ఇలా మారిపోయారు, డైటింగ్ చేస్తున్నారా? లేక మీ దగ్గర కూడా సినీ పరిశ్రమేమైన ఉందా? అసలు సీత మిమ్మల్ని ఇలా చూస్తె ఈ జన్మలో నన్ను మీతో పోల్చి తిట్టదు కదా? ఇన్ని రోజులూ మీ గురించి అలా అన్నందుకు సిగ్గుతో చచ్చిపోతుంది తెలుసా? మీకు కూడా మా హీరోలకు మళ్లే కాంపిటిషన్ ఎక్కువగా ఉంటుందా సామీ, స్వర్గం లో?
కాంపిటీశనా పాడా? తినడానికి తిండి లేదు, ఆకలికి మాడి పోతుంటే, ఎవరో భక్తురాలు ఒకసారి పాలు తెచ్చింది, ఆకలికి తాలక పాలు తాగితే మీ మీడియా వాళ్ళు రీసర్చ్ చేసి నీళ్ళు తాగుతాడేమోనని పరీక్షలు పెట్టారు. అలా తిండి, పాలూ మాని 11 రోజులూ ఒట్టి మంచి నీళ్ళుతాగి గడిపేసరికి ఇలా తయారయ్యాను.
అదేం సామీ! అంత ఆకలిగా ఉంటే చేతుల్లో ఉండే లడ్డు లాగించేయొచ్చు కదా? అందులో అది మీకు ఇష్టమైన నైవేద్యమాయే!
నాకిష్టమయినదే, కానీ ఎలా తినమంతావ్? ఆకలికి ఒకసారి ఇట్లానే తింటే, జనం నాపైన నిందలేశారు. దేవుడి దగ్గరే దొంగలు పడి దోచుకుంటే ఇంకా మమ్మల్ని ఈయనేం కాపాడుతాడని. అప్పటినుంచీ ఆకలికి ప్రేగులు పీక్కుపోతున్నా, నోరు కట్టేసుకుంటాం కాని మీ లడ్డూని మాత్రం ముట్టుకోం. దాన్ని ఆ 11 రోజులూ మోయలేకా కాపాడలేకా నరకం అనుభవించాల్సిందే! చూడు ఎడమ చేతి ఎంతగా వాచి పోయిందో?
నిజమే, అచ్చం నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సెలైను ఎక్కిస్తే వాచినట్లే ఉంది. అది సరే సామీ! మీకంతగా అన్యాయం జరుగుతుంటే ఇలా ఊరికే బాద పడేకన్నా మీ మిగతా సోదరులు గల్లీకి 10 చొప్పున ఉంటారు కాదా? అందరూ కలిసి ధర్నాలు చేయొచ్చు కదా?
నా మాట పూర్తి కాక ముందే నవ్వడం ప్రారంబించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ కాలంలో ఉన్నావు నాయనా నువ్వు? గల్లీకి 10 మాట దేవుడెరుగు పది గల్లీలకు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు.
ఇదేం విడ్డూరం సామీ? వీధి వీధికీ ఈ పది రోజులూ మీరే కనపడతారు మాకు ఇప్పుడేమయిందని మీ జనాభా తగ్గింది?
చెప్పాను కదా, మీ దేవుడనీ ప్రజలంతా ఆయన విగ్రహాల కోసం చందాలు ఇచ్చారంటా, ఇక మాకోసం ఇవ్వడానికి చిల్లి గవ్వా లేదని ఖరాఖండిగా చెప్పారట, ఇప్పుడు గణేష్ సంఘాలు కనుమరుగై కొత్త సంఘాలు వచ్చేసినాయ్. మా కోసం ఐతే సంవత్సరానికి ఒక్క సారే చందా వసూలు చేయొచ్చు. కాని నాయకుల కోసమైతే ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చు. అందుకే జనం అటు మొగ్గు చూపుతున్నారు. దాంతో మా బలం తగ్గిపోయింది.
అప్పటికే ట్యాంకు బందు మీద రద్దీ కొంచెం తగ్గింది, దీపాల కాంతి కూడా తగ్గుతుంది.
వెళ్ళు నాయనా, ఇంట్లో సీత నీకోసం ఎదురుచూస్తుంది. నా కస్టాలు చెప్పుకుంటూ పోతే ఎప్పటికి అంతం ఉండదు.
అవును, మాటల్లో పడి టైం మర్చి పోయాను. సరే ఉంటా సామీ, వీలయితే నిమజ్జనం రోజు కలుస్తా. ఆ రోజు ఎలాగో మాకు హాలిడే.
ఇంటి వైపుకు నడక ప్రారంబించాను. ట్యాంకు బండ్ నుంచి దోమల్ గూడా చేరడానికి పెద్ద సమయమేమి పట్టలేదు. నాకెందుకో మనసులో బాధగా అనిపించింది. నిజమే కదా? పాపం మనకి కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకుంటాం, అలాంటిది దేవుడికే కష్టాలొస్తే? జనం కూడా నిజంగానే దేవుళ్ళని మరిచి నాయకులకు పూజలు చేస్తున్నారు. ఆ మద్య సర్వ్ లో తేలిందేమంటే, రాష్ట్రం లో దేవుళ్ళ కోసం ఉపయోగించే పూల కన్నా నాయకులకోసం ఉపయోగించేది 5 రెట్లు ఎక్కువట. ఈ మద్య ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల విగ్రహాలే. అసలు ఎంత మంది నిజంగా ముఖ్యమైన ప్రదేశాల్లో విగ్రహాలుండాలనుకుంటున్నారు. బతికినన్నాళ్ళూ పేదల భూములు కాజేస్తున్నారు, చచ్చినాక రోడ్లన్నీ ఖబ్జా చేసేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రాంతాలకి వీరి పేర్లు పెడ్తున్నారు. చారిత్రిక ప్రాంతాలకు అట్లా పేరు మార్చడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పటి దాకా జనం దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు, ముందు ముందు ఈ లీడర్లు.. దేవుళ్ళకి నాయకుల పేర్లు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఈ మద్య టి వి చానల్ లో వినాయకుణ్ణి ఓ టెర్రరిస్టులా , ప్రకృతిని పాడుచేస్తున్న అణు బాంబులా చూపిస్తున్నారు. సాగర్లో వేస్తే కెమికల్స్ తో ఈ రాష్ట్రం మొత్తం కలుషితమవుతుందట. ఎంత బాదపడుతుందో కదా ఆ సామి మనసు !! అట్లా అంటే మనవల్ల ప్రకృతికి ఎంత నష్టం, ప్రకృతికి హాని అని మన కాలకృత్యాలు మానేశామా? రోజూ మనం వాడే వాహనాలూ గట్రా వల్ల వచ్చే నష్టం కన్నా ఏడాదికి ఒక సారి జరిగే నష్టం ఎక్కువేం కాదు. సరే అలా పాడుచేస్తే దానికోసం ప్రత్యామ్నాయం ఆలోచించాలి కానీ ఇలా గంటల కొద్దీ చానల్స్ లో ప్రోగ్రామ్స్ ఏమిటి? తినడానికి ఆహారం లేక, ఉండడానికి స్థలం లేక, చివరికి మొహానికి రంగు కూడా వేసుకోకుండా ఉండాలని దేవుడిని శాసిస్తున్నాడు మానవుడు.ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్దర పోయానో కాని తెల్ల వారి ఇంటి ముందు జరుగుతున్న హడావిడిని చూసి మెలుకువ వచ్చింది. ఇంటి ఓనర్ మా ఫ్లోర్ లో కనపడ్డాడు. అందరూ భయం భయం గా కనపడుతున్నారు. ఏమైందో నని కారిడార్ లోకి వెళ్లి చూస్తె లోయెర్ ట్యాంక్ బండ్ నీటిలో మునిగి పోయి ఉండి, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా జలమయ మైంది. టి వి ఆన్ చేసి చూస్తే, బ్రేకింగ్ న్యూస్ లో 'వినాయకుని ఆత్మహత్య' అని కనపడింది. ఆ ఫోటో చూస్తే రాత్రి నేను మాట్లాడిన వినయకుడిదే. పాపం అవమానం తట్టుకోలేక ఎంత పని చేసాడు.
ఈ వార్త తెలిసి నాయకులు ఒక్కరొక్కరే వచ్చి టి వి వాళ్ళకి కవరింగ్ న్యూస్ ఇస్తున్నారు. రోశయ్య 'నాకేమీ తెలవదు, అంతా హైకమాండ్ చూసుకుంటుంది , నన్ను అడుగుతారేం నేనే తోసినట్లు ' అని మీడియా పై రుసరుస లాడారు.
చంద్రబాబు 'దీనికి కారణం రోశయ్య ప్రబుత్వమే, కాబట్టి వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు'
కే సి ఆర్ ' ఇది తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం, వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే' అని డిమాండ్ చేసారు.
లగడ పాటి ' తెలంగాణ వినాయకులు మంచి వాళ్ళే, తప్పంతా తెరాస నాయకులదీ, పార్టీది! ప్రత్యేక రాష్ట్రం ఇస్తే రాష్ట్రం లోనే కాదు దేశం లోని అందరు వినాకులు చనిపోతారని జ్యోస్యం చెప్పారు.
కాంగ్రెస్స్ అధిష్టానం ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని ప్రకటించింది.
చిరంజీవి ' హుస్సేన్ సాగర్ నీళ్ళని పోలవరంలో కలిపేస్తే, ఇక్కడ నీళ్ళే ఉండవు కాబట్టి ఎవరు చనిపోయే అవకాశం లేదని' తిరుపతి నుంచి పోలవరానికి పాదయాత్ర మొదలు పెట్టాడు.
ఇక జగన్ మాత్రం ఇది పోయిన సంవత్సరం మా నాన్న చనిపోయినందుకు తట్టుకోలేక ఇప్పుడు ఈ వినాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించాడు. ఓదార్పు యాత్రగా హుస్సేన్ సాగర్ కి బయలు దేరి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకు తలా లక్షరూపాయల పరిహారం ప్రకటించి, టక్కున నాలుక కరుచుకుని లక్ష విలువ చేసే బంగారు నగలను చేయిస్తానని ప్రకటించారు. అంతే కాకుండా ఓదార్పులో బాగంగా హుస్సేన్ సాగర్ నిండా YS విగ్రహాలను ప్రతిస్టించాడు. దాంతో సాగర్ లోని నీళ్లన్నీ బయటకు వచ్చేసి దోమల గూడ, లోవెర్ ట్యాంక్ బండ్ జలమయమయ్యాయి. ఇదంతా చూస్తూ బుద్దుడు కంగు తిన్నాడు. YS విగ్రహాల మద్య తన విగ్రహం చిన్నదైపోయింది.
రాష్ట్రం లో మార్పులను గమనిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ జనం జగన్ కు దగ్గర అవుతున్నారని బావించి చనిపోయిన కుటుంబాలు అక్కడ లేనందున ఉన్న విగ్రహాలకు పరిహారంగా పది లక్షలు ప్రకటించింది. అంతకు ముందే అన్ని విగ్రహాలకు పరిహారం చెల్లించే రైట్ జగన్ తీసుకున్నాడు కాబట్టి బుద్ద విగ్రహానికి బంగారు పూత పూయించి పెద్ద కిరీటం పెట్టించింది. అన్ని విగ్రహాల మద్య ఇప్పుడు బుద్దుడు వెలిగి పోతున్నాడు, ట్యాంక్ బండ్ పైన మిగిలిన విగ్రహాలు కూడా ముందు కంటే అందంగా మెరిసిపోతున్నాయి. వినాయకుణ్ణి మాత్రం నాయకులే కాకుండా ప్రజలు కూడా మరిచిపోయారు.